కలం, వెబ్ డెస్క్ : నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) మరోసారి వివాదంలో నిలిచారు. జై శ్రీరామ్ నినాదాలు చేసే కొందరి ప్రవర్తనపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. జై శ్రీరామ్ అనేవాళ్లలో కొందరు పెద్ద దొంగలు ఉన్నారని, ఆ నినాదం ముసుగులో దాడులకు తెగబడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కేవలం నినాదాలు చేసినంత మాత్రాన విలువలు ఉన్నట్లు కాదని, మనుషుల ప్రవర్తనే అత్యంత ముఖ్యమని ఆమె అన్నారు. సనాతన ధర్మం పేరుతో దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
నా కొడుక్కి హనుమంతుడి పేరే పెట్టా
తనపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ, తాను కూడా నిత్యం కొలిచేది శ్రీరాముడినే అని అనసూయ తెలిపారు. తన భక్తిని ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదని, తన పెద్ద కొడుక్కి హనుమంతుడి పేరే పెట్టానని గుర్తుచేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. పలువురు నెటిజన్లు, హిందూ సంఘాల ప్రతినిధులు అనసూయ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివాదంపై అనసూయ మరో వీడియో స్పందన
వివాదం మరింత ముదరడంతో అనసూయ మరొక వీడియోను విడుదల చేశారు. తన వ్యాఖ్యల తర్వాత అసలైన దొంగలంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. తన భావాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా కొందరు ఉద్దేశపూర్వకంగానే రచ్చ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్గా మారింది.

