కలం, వెబ్ డెస్క్ : నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ పులుల రక్షిత (Amrabad Tiger Reserve) అభయారణ్యంలో జంగల్ సఫారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీ శాఖ ప్రకటించింది. వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, జులై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు మొత్తం మూడు నెలల పాటు ఈ సఫారీ సేవలను బంద్ చేస్తున్నట్లు జిల్లా అటవీ అధికారి (DFO) రేవంత్ చంద్ర వెల్లడించారు. ఈ మూడు నెలల పాటు అడవిలో జంతువుల స్వేచ్ఛా విహారానికి, వాటి ప్రశాంతతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా అభయారణ్యం గుండా సాగే శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్రయాణించే వాహనదారులకు అటవీ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ నిషేధిత కాలంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల రహదారిపై వెళ్లే వాహనాలు గంటకు 30 కిలోమీటర్ల వేగాన్ని మించకూడదని డీఎఫ్ఓ స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా ఈ వేగ పరిమితి నిబంధనలను అతిక్రమిస్తే, వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రయాణికులు, పర్యాటకులు అటవీ శాఖ నిబంధనలకు కట్టుబడి వన్యప్రాణుల సంరక్షణకు సహకరించాలని అధికారులు కోరారు.

