కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ లో తొలిదశ పోలింగ్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. తొలి దశలో ఎన్నికలు జరిగిన 152 స్థానాల్లో 110 సీట్లను బీజేపీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థం అయిందని చెప్పుకొచ్చారు. అందుకే తొలి దశలో గత ఎన్నికల కంటే 10 శాతం ఎక్కువగా ఓటింగ్ నమోదైందని తెలిపారు. ఈ భారీ ఓటింగ్ శాతం బీజేపీకి అనుకూలంగా ఓ నిర్ణయాత్మక మార్పును సూచిస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్లో దీదీ దిగిపోయే సమయం వచ్చిందని .. టీఎంసీ ఓటమి ఖాయమని వెల్లడించారు.
మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రభుత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించాయని, సామాన్యులకు రక్షణ కరువైందని అమిత్ షా (Amit Shah) మండిపడ్డారు. దీదీ ప్రభుత్వ హయాంలో జరిగిన వరుస కుంభకోణాలు, ఇసుక మాఫియా, మహిళలపై దాడుల పట్ల బెంగాల్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆరోపించారు. ఇదే సమయంలో కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటర్లు బీజేపీ పట్ల ఆకర్షితులువున్నారని చెప్పారు. రెండో దశ ఎన్నికల్లోనూ ఓటర్లు బీజేపీకే పట్టం కడతారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే బయటి వ్యక్తులు పాలిస్తారని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వస్తే బెంగాల్ కు చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి చేస్తామని స్పష్టం చేశారు.
కాగా, పశ్చిమ బెంగాల్ లోని 294 అసెంబ్లీ స్థానాలకు రెండు దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం 152 స్థానాలకు తొలి దశ పోరు జరిగింది. తొలి దశ పోరులో 91.88 శాతం ఓటింగ్ నమోదైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అక్కడ ఇదే అత్యధిక ఓటింగ్ శాతంగా రికార్డు నెలకొల్పడం గమనార్హం. దీంతో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరా హోరీ పోరు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది. మే 4న ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేస్తారు.
Read Also: ఇరాన్ రాజకీయాల్లో సంచలనం.. ఆర్మీ చేతుల్లోకి దేశ పాలన!
Follow Us On : WhatsApp

