కలం, వెబ్ డెస్క్: ట్రాన్స్పోర్ట్ రంగంలో ఇండియా దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా భారీ కారిడార్లు, ఫ్లై ఓవర్లు, హైవేలతోపాటు మెట్రో, వందే భారత్ లాంటి రైళ్లతో అత్యాధునిక రవాణా సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికులే లక్ష్యంగా ‘భారత్ టాక్సీ’ సేవలు మొదలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) ‘భారత్ టాక్సీ’ (Bharat Taxi) సేవలను ప్రారంభించారు. రవాణా రంగంలో పెను మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ వినూత్న ప్లాట్ఫారమ్ను రూపొందించారు.
ఇప్పటివరకు ఓలా, ఉబెర్ వంటి ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం ఉన్న ఈ రంగంలో డ్రైవర్ల సంక్షేమమే ధ్యేయంగా భారత్ టాక్సీ (Bharat Taxi) అడుగుపెట్టింది. ఇక్కడ డ్రైవర్లు కేవలం పనివారు మాత్రమే కాదు.. ఒక్కో డ్రైవర్ ఐదు షేర్లను కలిగి ఉండి, సంస్థలో యాజమాన్య భాగస్వాములుగా కొనసాగుతారు. డ్రైవర్లు ప్రతి రైడ్ (Ride)పై కంపెనీకి భారీ కమిషన్లు చెల్లించాల్సిన పనిలేదు. కేవలం రోజుకు రూ. 30 ఫ్లాట్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధానం వల్ల డ్రైవర్ల ఆదాయం పెరగడమే కాకుండా, ప్రయాణికులకు కూడా లాభం చేకూరనుంది. ప్రైవేట్ టాక్సీలతో పోలిస్తే భారత్ టాక్సీలో ప్రయాణ ఛార్జీలు దాదాపు 30 శాతం తక్కువగా ఉండనున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ-NCR పరిధిలో 2.5 లక్షల వాహనాలతో మొదలైన ఈ సేవలను, రాబోయే రెండేళ్లలో దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రయాణికుల భద్రతకు ఇది పెద్దపీట వేసింది. ఢిల్లీ పోలీసుల సహకారంతో నగరవ్యాప్తంగా 35 ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడమే కాకుండా, యాప్లో అత్యాధునిక భద్రతా ఫీచర్లను జోడించారు. ఐఫ్కో (IFFCO), అమూల్, నాబార్డ్ వంటి ప్రతిష్టాత్మక సహకార సంస్థల సహకారంతో ఈ సేవలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద రోజుకు 5,500 ప్రయాణాలతో విజయవంతమైన ఈ సేవలు ఆన్లైన్లోనూ సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి.
Read Also: రేపటి నుండి ‘గద్దర్’ చలనచిత్ర ప్రదర్శన
Follow Us On: Youtube


