కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో రాజకీయాల్లో పొత్తుల చుట్టూ తిరుగుతున్న ఊహాగానాలకు బీజేపీ అధిష్టానం చెక్ పెట్టింది. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో జరిగిన ప్రత్యేక చిట్చాట్ లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. తెలంగాణలో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళ్తామని చెప్పారు.
మరోవైపు డీలిమిటేషన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో పసలేదని అమిత్ షా ఆరోపించారు. డీలిమిటేషన్ తో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని వెల్లడించారు. వన్ నేషన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లుపై అధ్యయనం జరుగుతుందన్న అమిత్ షా.. త్వరలో జమిలీ ఎన్నికపై స్పష్టమైన ప్రకటన ఉంటుందని చెప్పారు. అటు దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై అమిత్ షా స్పందిస్తూ.. ఆమె నామినేషన్ తిరస్కారంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారని వెల్లడించారు.

