కలం, వెబ్ డెస్క్: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) జులై మూడో తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీరులో హై అలర్ట్ ప్రకటించారు. మరీ ముఖ్యంగా యాత్రికులు రాకపోకలు సాగించే శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపై వందలాది మంది భద్రతా సిబ్బందిని నియమించారు. గురువారం కందిజల్ జాతీయ రహదారిపై జమ్మూ పోలీసులు, సీఆర్పీఎఫ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్ర దాడులు జరిగితే ఎలా ప్రతిస్పందించాలో సాధన చేశారు. యుద్ధ విన్యాసాలు కూడా చేపట్టారు. ఇక, యాత్ర జరిగినంత కాలం అనుమానిత వాహనాలు, వ్యక్తుల కదిలకలపై ఏఐ సాయంతో కూడా నిఘా తీవ్రతరం చేయబోతున్నారు.
అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష..
అమర్నాథ్ యాత్రకు వచ్చే భక్తులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో పారామిలటరీ దళాల అధిపతులకు దిశానిర్దేశం చేశారు. భక్తులను ఉగ్రవాదులకు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

