కలం, వెబ్ డెస్క్ : రాజధాని అమరావతి చట్టబద్దతపై ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పందించారు. అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీలో తీర్మానం చేసే అవసరం ఏం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. చట్టబద్ధత చేయాలంటే మండలి కూడా సమావేశం కావాలని సూచించారు. చంద్రబాబు అమరావతిలో అవినీతి యజ్ఞం చేస్తున్నారని విమర్శించారు. అయితే రాజధానిగా అమరావతి ఉండటాన్ని తమ అధినేత జగన్ వ్యతిరేకించడం లేదన్న సజ్జల.. రాజధాని పేరుతో జరుగుతున్న భారీ అవినీతిని, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
రాజధాని కనెక్టివిటీ కోసం వెస్ట్ బైపాస్ వంటి పనులను వైసీపీ హయాంలోనే పూర్తి చేశామని.. కానీ ఇప్పుడు చంద్రబాబు కేవలం అప్పులు తెచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ల రూపంలో కమీషన్లు కొట్టేస్తున్నారని సజ్జల ఆరోపించారు. అమరావతి టెండర్ల వ్యవహారం గోప్యంగా ఉంచారని, అవినీతిని ప్రశ్నిస్తే రాజధానికి వ్యతిరేకమంటున్నారని పేర్కొన్నారు. అమరావతి పేరుతో రాష్ట్ర భవిష్యత్తును చీకట్లోకి నెడుతున్నారని, ప్రజల సొమ్మును పీల్చి పిప్పి చేస్తున్నారన్నారని సజ్జల ఫైర్ అయ్యారు. ప్రజల సొమ్మును కొద్దిమంది ప్రయోజనం కోసం ఖర్చు చేయడాన్ని తాము అంగీకరించబోమని తెలిపారు. అమరావతిలో జరిగే అవినీతికి తాము వ్యతిరేకమని సజ్జల స్పష్టం చేశారు.

