కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదం నింపిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనలో (Ajit Pawar Plane Crash) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరి 28వ తేదీన పుణె జిల్లా బారామతి సమీపంలో జరిగిన లీర్జెట్ 45ఎక్స్ఆర్ విమాన ప్రమాదంలో అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే అజిత్ పవార్ విమాన ప్రమాద మరణం వెనుక పెను కుట్ర దాగి ఉందని ఆయన మేనల్లుడు, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ (Rohit Pawar) సంచలన ఆరోపణలు చేశారు. ఈ విమాన ప్రమాదం కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగింది కాదని, అజిత్ పవార్ను హతమార్చేందుకు పథకం ప్రకారం జరిగిన కుట్రగా అభివర్ణించారు. నిజనిజాలు బయటకు రావాలంటే నిష్పక్షపాత విచారణే మార్గమని.. ప్రధాని మోదీ, అమిత్ షా స్వయంగా స్పందించి అజిత్ దాదాకు న్యాయం చేయాలని కోరారు.
కాగా, రోహిత్ పవార్ సంచలన ఆరోపణలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) స్పందించారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణంపై విచారణ జరపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ మేరకు అజిత్ పవార్ మరణంపై సమగ్ర విచారణ చేయాలని లేఖలో కోరారు. అంతకుముందు అజిత్ పవార్ మరణంపై దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నాయని రోహిత్ పవార్ వేలెత్తి చూపారు. ప్రయాణానికి కొద్ది నిమిషాల ముందు పైలట్లను ఎందుకు మార్చారు? విమానంలోని వాయిస్ రికార్డర్ ఎందుకు పనిచేయలేదు? విమాన ఇంజన్లు కాలం చెల్లినవని తెలిసినా అధికారులు ఎలా అనుమతించారు? వంటి ప్రశ్నలను ఆయన లేవనెత్తారు.ఈ ప్రమాదం వెనుక రెండు రకాల కుట్రలు ఉండే అవకాశం ఉందని రోహిత్ పవార్ అన్నారు. అజిత్ పవార్ను పక్కకు తప్పించేందుకు రాజకీయ ప్రత్యర్థులు చేసిన ప్రయత్నం కావొచ్చుని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే వీఎస్ఆర్ సంస్థ ప్రయోజనాల కోసం లేదా భద్రతా లోపాలను కప్పిపుచ్చేందుకు జరిగిన కుట్ర కావొచ్చని పేర్కొన్నారు. దీంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తాజాగా విమాన ప్రమాదంపై విచారణ కోరుతూ అమిత్ షాకు లేఖ రాశారు. ఈ లేఖపై అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తారో చూడాలి.

