కలం, కరీంనగర్: దేశంలోని అన్ని రంగాల కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ఏఐటీయూసీ (AITUC) నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తోందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు(S.Balaraju) అన్నారు. గురువారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఏఐటీయూసీ కరీంనగర్(Karimnagar) జిల్లా 5వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఏఐటీయూసీ (AITUC) దేశంలో తొలి కార్మిక సంఘమని, స్వాతంత్ర ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించిందని బాలరాజు పేర్కొన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల హక్కుల కోసం కనీస వేతనాలు, పని గంటల తగ్గింపు, వేతనాల పెంపు వంటి అంశాలపై ఎన్నో పోరాటాలు నిర్వహించి అనేక కార్మిక చట్టాల సాధనకు కృషి చేసిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి హక్కులను బలహీనపరిచిందని ఆయన విమర్శించారు. సమ్మె చేసే హక్కును కూడా కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత కార్మికులను ఐక్యం చేసి వారి హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని, సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, గౌరవ అధ్యక్షుడు కాసెట్టి లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Read Also: కేసీఆర్ వస్తే లాగులు తడుపుకుంటారు.. జగదీశ్ రెడ్డి ఫైర్
Follow Us On: Instagram

