కలం, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే పార్టీ (AIADMK Party) రెండుగా చీలిపోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామితో విబేధించిన సీవీ.షణ్ముగం వర్గం.. తాము ఇక నుంచి విడిగా ఉంటామని ప్రకటించింది. పళనిస్వామి ఒంటెద్దు పోకడల కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోతుందని, ఇటీవల ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయినట్లు విమర్శించింది. ఇక నుంచి ఆయనతో కలిసి నడవబోమని తేల్చి చెప్పింది. అన్నాడీఎంకే 47 స్థానాలు గెలుపొందగా.. పళనిస్వామికి 17 మంది, షణ్ముగం, వేలుమణి వర్గానికి 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటం గమనార్హం.
ఇక నుంచి టీవీకే పార్టీకే మద్దతు..
చీలిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్నాడీఎంకే నేత సీవీ.షణ్ముగం మాట్లాడుతూ.. “ఇక నుంచి తాము టీవీకే పార్టీకి మద్దతు ఇస్తాం. డీఎంకే పార్టీకి వ్యతిరేకంగా 53 ఏళ్ల కిందట అన్నాడీఎంకే ఏర్పడింది. అలాంటిది, ఇటీవల ఆ పార్టీతోనే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కుట్రకు తెరదీశారు. దీన్ని మెజార్టీ సభ్యులం వ్యతిరేకించాం. నిజంగా మేం డీఎంకేతో కలిస్తే.. అన్నాడీఎంకే ఉనికే ఉండదు. ప్రస్తుతం మేం ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఉండాలని భావిస్తున్నాం. కాకపోతే, టీవీకే పార్టీకి మాత్రం మా మద్దతు ఉంటుంది” అని స్పష్టం చేశారు.

