కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా సింగర్ మంగ్లీ (Singer Mangli) మైక్రో ఫైనాన్స్ కేసు, అడ్వొకేట్ సుబ్బారావుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మంగ్లీ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసింది. తను ఏ తప్పు చేయలేదని, తప్పు చేసినట్లయితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని, తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై అడ్వొకేట్ సుబ్బారావు తీవ్ర స్థాయిలో స్పందించారు. మంగ్లీ ఏ తప్పు చేయకపోతే గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు డీజీపీ ఆఫీస్కు రావాలని సవాల్ విసిరారు. లేదా మైక్రో ఫైనాన్స్ బాధితులకు న్యాయం జరిగేందుకు పోరాడాతానని మంగ్లీ చెప్పిన నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్కు తన సోదరులతో కలిసి రావాలని సవాల్ విసిరారు. రమావత్ మధు, శైలజ చౌహాన్, భరత్ చౌహాన్లను తీసుకొని రావాలన్నారు. అలాగే మంగ్లీ తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు తీసుకొచ్చి రుజువు చేయాలని డిమాండ్ చేశారు. మంగ్లీకి తెలిసే మోసం జరిగిందని, రమావత్ మధు కంపెనీలో మంగ్లీ సోదరుడు శివకి భాగస్వామ్యం ఉందని సుబ్బారావు ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ మంగ్లీపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

