కలం, కరీంనగర్ బ్యూరో (జగిత్యాల): ధర్మపురి నియోజకవర్గం (Dharmapuri Constituency)లోని గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) తెలిపారు. పెగడపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 68 మంది లబ్ధిదారులకు సోమవారం సీఎం సహాయ నిధి చెక్కులు, 9 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు సేవ చేయడం తన ప్రధాన బాధ్యత అని అన్నారు. పేద ప్రజల జీవితాల్లో ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ప్రతి పేద కుటుంబం కలగంటున్న సొంతింటి స్వప్నాన్ని సాకారం చేయడమే తన లక్ష్యమని, అందులో భాగంగా అర్హులైన నిరుపేదలకు జూలై నెల నాటికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేస్తామని మంత్రి వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాల కోసం పెగడపల్లి మండలానికి రూ.2.51 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ నిధులతో గ్రామాల మధ్య రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టి ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామని మంత్రి చెప్పారు. అదేవిధంగా, మండల వ్యాప్తంగా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని, రైతులకు నీటి ఇబ్బందులు లేకుండా చేసి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సాగునీటి వసతుల విస్తరణతో పెగడపల్లి మండలాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

