కలం, నిర్మల్: సారంగాపూర్ (Sarangapur) మండలం అడెల్లి గ్రామంలోని శ్రీ మహా పోచమ్మ అమ్మవారి ఆలయ(Adelli Pochamma Temple) హుండీ లెక్కింపును శుక్రవారం నిర్వహించారు. ఆలయంలోని అన్ని హుండీలను లెక్కించగా రూ.58,41,141 నగదు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ భూమయ్య తెలిపారు. హుండీల ద్వారా నగదుతో పాటు 18 తులాల మిశ్రమ బంగారం, 3 కిలోల మిశ్రమ వెండి లభించినట్లు వెల్లడించారు. హుండీ లెక్కింపు ప్రక్రియను అధికారులు, ఆలయ సిబ్బంది సమక్షంలో నిర్వహించారు.
హుండీ లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుదర్శన్, కదిలి శ్రీమాత అన్నపూర్ణ పాపరేశ్వర ఆలయ ఈఓ రాజేష్, గ్రామ సర్పంచ్ సాయన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదిల్, మాజీ సర్పంచ్ సుచరిత రాజేశ్వర్, మాజీ ఆలయ చైర్మన్లు ఉట్ల రాజేశ్వర్, మాధవరావు, మాజీ ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

