కలం, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట(Suryapet) జిల్లాలో ఏసీబీ దాడుల కలకలం రేగింది. గతంలో జిల్లా డిఆర్డీఏ పీడీగా పనిచేసిన కిరణ్ కుమార్(Kiran Kumar) ఇంటిపై ఏసీబీ(ACB) ఆకస్మిక దాడులు చేసింది. గరిడేపల్లి మండలం పొనుగోడులోని తన సొంత ఇంటిలో ఉదయం ఏసీబీ తనిఖీ చేపట్టింది. దీంతో పాటుగా నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. పొనుగోడు, నేరేడుచర్లలో అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ సుందరి కిరణ్ ఇంట్లో, బంధువుల మిల్లులపై ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా జడ్చర్లలో కిరణ్ కుమార్ (Kiran Kumar) అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ (ACB) అధికారులు గుర్తించారు. మరోవైపు హైదరాబాద్, తుంగతుర్తి, సూర్యాపేట, నేరేడుచర్లలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో సూర్యాపేట జిల్లా డీఆర్డివో పీడీగా కిరణ్ పని చేశారు. అయితే ఆ సమయంలో ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు.
అప్పట్లో ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు బయటపడడం.. సీఎంఆర్(CMR) విషయంలో కొన్ని రైస్ మిల్లులకు అనుకూలంగా వ్యవహరించడంపైన విమర్శలు లేకపోలేదు. దీనికితోడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సన్నిహితుడుగా ఉండడంతో జిల్లా మొత్తంలో చక్రం తిప్పారు. ఆఖరికి అసెంబ్లీ ఎన్నికల్లోను బీఆర్ఎస్ అభ్యర్థులకు అనుకూలంగా పనిచేశారని ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ పై ఏసీబీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.


