కలం, వెబ్డెస్క్: పెళ్లి చేసుకుందామనుకున్న ప్రేమ జంటకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే దోపిడీకి దిగారు. ఇద్దరు పోలీసులు ప్రేమ జంట వ్యక్తిగత వ్యవహారంలో తలదూర్చి, వారిని భయపెట్టి అందినకాడికి దోచుకోవాలనుకున్నారు. బాధిత ప్రేమ జంట ఇద్దరు పోలీసులను ఏసీబీ (ACB)కి పట్టించి బుద్ధి చెప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం (Tadepalligudem) పట్టణ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
తాడేపల్లిగూడెంలో (Tadepalligudem) ఒక ప్రేమ జంట వివాహం చేసుకుంది. దీనికి సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న ఎస్సై పి.నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ వారిని తీవ్రంగా బెదిరించారు. సెటిల్మెంట్ పేరుతో సదరు జంట నుంచి రూ.70 లంచం డిమాండ్ చేశారు. పోలీసుల వేధింపులతో విసిగిపోయిన బాధితులు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం గురువారం ఎస్సై, కానిస్టేబుల్ ఆ జంట నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ బృందం మెరుపు దాడి చేసి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.
ప్రేమ జంటను సైతం వదలకుండా లంచం డిమాండ్ చేశారంటే, వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఈ కేసుతోనే సరిపెట్టకుండా , ఈ ఇద్దరు పోలీసుల అక్రమ ఆస్తుల పైన కూడా ఏసీబీ దృష్టి సారించాలని బాధితులు, సామాన్య ప్రజలు కోరుతున్నారు. లోతుగా విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: చమురు సంక్షోభం.. ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్రం కీలక నిర్ణయం..!
Follow Us On: Sharechat

