కలం, కరీంనగర్ బ్యూరో : అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నేరుగా డబ్బులు తీసుకోవడానికి భయపడి డిజిటల్ పేమెంట్లను ఆశ్రయించినా ఏసీబీ అధికారులు వదలడం లేదు. పెద్దపల్లి (Peddapalli) జిల్లాలోని పొత్కపల్లి గ్రామం కార్యదర్శి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. గ్రామంలో ఒక ఇంటి పర్మిషన్ (అనుమతి) మంజూరుకు సెక్రటరీ కుమారస్వామి బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేశాడు.
రూ.5,000 లను ఫోన్ పే ద్వారా పంపాలని నిందితుడు సూచించాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా ప్లాన్తో రంగంలోకి దిగారు. ఫోన్ పే ద్వారా చెల్లింపును గుర్తించి కుమారస్వామిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ పనుల కోసం సామాన్యులను ఇబ్బంది పెడుతూ లంచాలకు పాల్పడితే ఎంతటి వారైనా తప్పించుకోలేరని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.

