కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని చేనేత కార్మికుల గొంతును కాంగ్రెస్ ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ (Dasoju Sravan ) ఫైర్ అయ్యారు. హైకోర్టు తీర్పులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ సంస్థ అయినా టెస్కో నుంచే హ్యాండ్లూమ్ కొనాలని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని చెప్పారు. మళ్లీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వారి నాయకుల ధనదాహం, కమీషన్ల కోసం మరో జీవో తెచ్చి బ్లాక్లిస్ట్లో ఉన్న కంపెనీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు.
రేవంత్ పరిపాలనా యంత్రాంగం మొత్తం దోపిడీ కోసం, కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్న చిల్లర ప్రభుత్వంలా మారిందని తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి దోపిడీ కనపడుతోందని చెప్పారు. రేవంత్ రెడ్డి పాలనలో ‘మహిళా రక్షణ’ అటకెక్కిందని దుయ్యబట్టారు. ఒక మహిళా ఐపీఎస్ అధికారి మారువేషంలో వెళ్తేనే 40 మంది పోకిరీలు చుట్టుముట్టారంటే, సామాన్య మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి.. కమాండ్ కంట్రోల్ సెంటర్ సెటిల్మెంట్ల కోసమా? లేక ప్రజల రక్షణ కోసమా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ సేఫ్టీని గాలికొదిలేసి, ప్రచార ఆర్భాటాలకే పరిమితమైన మీ అసమర్థతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

