కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda) జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన దాడులలో పాలకుర్తి (Palakurthi) ఇరిగేషన్ విభాగానికి చెందిన డీఈ శ్రీకాంత్ (DE Srikanth) రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బిల్లులపై సంతకం చేయడానికి రూ.50 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా పెద్దవంగర మండలం కన్వాయిగూడెం గ్రామానికి చెందిన కర్ర అశోక్రెడ్డి తన పనులకు సంబంధించిన బిల్లులపై సంతకాలు చేయించుకోవడానికి పాలకుర్తి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ను సంప్రదించాడు. అయితే బిల్లులు క్లియర్ చేయాలంటే రూ.50 వేల లంచం ఇవ్వాలని డీఈ డిమాండ్ చేసారు.
దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం హనుమకొండ జిల్లా భవానీనగర్లో ఏర్పాటు చేసిన ఆపరేషన్లో డీఈ శ్రీకాంత్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం అధికారులు డీఈ నివాసం, కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.

