కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని అత్తాపూర్లో (Attapur) అర్ధరాత్రి ఓ యువతి కిడ్నాప్ (Kidnap)కు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. ఓ థార్ కారులో వచ్చిన నలుగురు యువకులు ఓ యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించుకుని అక్కడి నుండి వేగంగా పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై, అత్తాపూర్ నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు కారును ఛేజ్ చేశారు. అయితే, ఆ కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడం, నిందితులు మితిమీరిన వేగంతో దూసుకెళ్లడంతో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనలో పోలీసులు దాదాపు నాలుగు గంటల వరకు కిడ్నాపర్ల కోసం అలుపు లేకుండా వెతికారు. మరోవైపు కంట్రోల్ రూమ్ నుండి అత్తాపూర్ నుండి దాదాపు శంషాబాద్ వరకు.. చుట్టుపక్కల అప్రోచ్ రోడ్లలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. కారు వెనకాలే మరో బైక్ కూడా ఫాలో అయినట్టు గుర్తించారు. ప్రత్యక్ష సాక్షులు, అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ సమయంలో ఏం జరిగింది? అనే విషయమై కీలక వివరాలు సేకరిస్తున్నారు. జనాల కదలిక ఉన్న ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.

