Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్‌సీబీ గెలవడానికి ఆ ఒక్క షాటే కారణం: ఇర్ఫాన్ పఠాన్

కలం, స్పోర్ట్స్: ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయం సాధించింది. కానీ అసలు ఈ విజయానికి అసలు కారణం కృణాల్ చేసిన 73 పరుగులు కావని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) అన్నారు. అంతేకాకుండా అసలు ఆర్‌సీబీ విజయాన్ని, ముంబై ఓటమిని శాసించింది ఒకే ఒక్క షాట్ అని వివరించారు. అదే భువనేశ్వర్ కుమార్ కొట్టిన ఆ ఒక్క సిక్సర్ అని అన్నారు. ఆ సిక్సరే లేకపోతే ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా ఓడిపోయేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబైపై గెలిచిన ఆర్‌సీబీ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా, ముంబై ప్లేఆఫ్ ఆశలను కూడా గండికొట్టింది.

తొలుత బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శన చేశారు. కేవలం 23 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి ముంబై బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మను తన తెలివైన నకిల్ బాల్‌తో బోల్తా కొట్టించిన తీరును పఠాన్ మెచ్చుకున్నారు. ఒకవేళ రోహిత్ వికెట్ పడకపోయి ఉంటే ముంబై భారీ స్కోరు సాధించేదని, కానీ భువనేశ్వర్ తన అనుభవంతో మ్యాచ్‌ను ఆర్‌సీబీ వైపు తిప్పారని పఠాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నారు.

అయితే అసలైన డ్రామా ఆర్‌సీబీ బ్యాటింగ్ సమయంలో చోటు చేసుకుంది. చివరి మూడు బంతుల్లో ఆర్‌సీబీకి తొమ్మిది పరుగులు కావాల్సిన సమయంలో భువనేశ్వర్ క్రీజులోకి వచ్చారు. బౌలర్ ఎక్కడ బంతి వేయబోతున్నాడో ముందే ఊహించిన భువనేశ్వర్.. ఆఫ్ స్టంప్ వెలుపల వచ్చిన బంతిని కవర్స్ మీదుగా అద్భుతమైన సిక్సర్‌గా మలిచారు. ఆ షాట్ గనక పడకపోతే బెంగళూరుకు గెలిచే అవకాశం నూటికి నూరు శాతం ఉండేది కాదని పఠాన్ వివరించారు. ఓవరాల్‌గా అటు బౌలింగ్‌లోనూ, ఇటు కీలక సమయంలో బ్యాటింగ్‌లోనూ రాణించిన భువనేశ్వర్ కుమార్‌ (Bhuvneshwar Kumar)కు ఇది మరపురాని రోజని పఠాన్ కొనియాడారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>