కలం, వెబ్ డెస్క్: అవమానం.. సమాజ గతిని, ప్రపంచ రీతిని మార్చిన అనేక ఉద్యమాలకు శక్తిమంతమైన ఆయుధం. ముఖ్యంగా స్వేచ్ఛా, స్వాతంత్య్రం కోసం జరిగిన చిరస్మరణీయ పోరాటాలకు ఇదే ఇంధనం. అబ్రహాం లింకన్, మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా.. ఒక్కరేమిటి? ఎంతో మంది మహనీయులను లక్ష్యం వైపు నడిపించింది ఇదే. అలాంటి ఓ అవమానమే.. కోట్లాది భారతీయులను ఒక్కటిగా చేసిన గీతానికి ప్రాణం పోసింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దేశం నుంచి తరిమికొట్టేందుకు ఆసేతుహిమాచలాన్ని గళమెత్తేలా చేసింది. ఆ జన జాగృత గీతమే వందేమాతరం (Vande Mataram). భారత స్వాతంత్య్ర సంగ్రామంలో భాగమైన ఈ గీతం పుట్టి ఈ ఏడాది నవంబరు 7తో 150 ఏళ్లు వసంతాలు వచ్చాయి. ఈ సందర్భంగా నేడు (డిసెంబర్ 8న) లోక్ సభలో ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ క్రమంలో కోట్లాది భారతీయుల గుండె గీతమైన వందేమాతరం ఎలా పుట్టిందో తెలుసుకుందాం.
మేనాలోంచి లాగి పడేయడంతో..
బంకించంద్ర ఛటోపాధ్యాయ.. ప్రసిద్ధ బెంగాలీ కవి, రచయిత, ఉన్నత విద్యావంతుడు. 1838, జూన్ 26న జన్మించారు. బ్రిటీష్ ప్రభుత్వంలో డిప్యూటీ మేజిస్ట్రేట్ గా పనిచేసేవారు. ఓ రోజు పని మీద మేనా (పల్లకీ)లో వెళుతున్నారు. కాస్త దూరం వెళ్లగానే హఠాత్తుగా ఎక్కడి నుంచో ఆ ఏరియా కల్నల్ ఊడిపడ్డాడు. మేనాలో వెళ్తున్న బంకించంద్రను చూసి ఆవేశం పట్టలేకపోయాడు. ‘నల్లవాడివి.. నీకు పల్లకీ కావాల్సొచ్చిందా? వెంటనే దిగిపో ..’ అంటూ గట్టిగా అరిచాడు. పల్లకీని మోస్తున్న బోయీలు భయంతో ఆగిపోయారు. ‘ఆయన మన డిప్యూటీ మేజిస్ట్రేట్’ అంటూ అతని పక్కనున్నవాళ్లు హెచ్చరిస్తున్నా..‘అయితే ఏంటి?’అంటూ నేరుగా పల్లకీ వద్దకు వచ్చి బంకించంద్రను బయటకు లాగాడు. పిడిగుద్దులు గుద్దాడు.తానెవరో తెలిసినా అహంకారంతో తనను అవమానపర్చిన ఆ కల్నల్ పై మండిపడ్డాడు బంకించంద్ర. ఆ కల్నల్ కాస్త తగ్గి ‘సారీ ’ చెప్పినా అంగీకరించలేదు. తనకు జరిగిన అవమానానికి కోర్టులో బహిరంగ క్షమాపణ చెప్పించుకునేవరకు వదల్లేదు.
ఆ ఆలోచనే..
తనకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకున్నా ఆ సంఘటన బంకించంద్ర మనసులోంచి చెరిగిపోలేదు. ‘అధికారినైన నన్నే అవమానిస్తే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?’ అనే ఆలోచన తలెత్తింది. అదే సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం ‘గాడ్ సేవ్ ద కింగ్ ’ అనే తమ ప్రార్థనా గీతాన్ని భారత జాతీయ గేయంగా ప్రకటించాలని చూస్తోందని తెలిసింది. అంతే, ఆ ఆవేశంలో ఆయన కలం నుంచి పుట్టిన గీతమే ‘వందేమాతరం’. మొదట రెండు పాదాలతో పురుడు పోసుకున్న ఆ గీతం పుట్టింది నవంబర్ 7, 1875.ఆ తర్వాత మరో పాదాలను గీతానికి జత చేశాడాయన. అదే గీతాన్ని తాను రాసిన ఆనంద్ మఠ్ నవలలో మొదటిసారి ప్రచురించాడు. ఈ గీతానికి బాణీ కట్టింది, తొలిసారి పాడింది మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. 1886లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ఆయన ఈ గీతాన్ని హృద్యంగా ఆలపించారు.
కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా..
బెంగాల్ విభజన సమయంలో వందేమాతరం(Vande Mataram) గీతం మారుమోగింది. ఆ తరువాత క్రమంగా ఇది దేశమంతా విస్తరించింది. అన్ని భాషల్లోకి తర్జుమా అయ్యింది. స్వతంత్ర పోరాట సమయంలో కోట్లాది భారతీయల గొంతుల్లో పిక్కటిల్లింది.భారతీయులందరినీ ఏకతాటిపై నడిపింది. బ్రిటీష్ వారిని తరిమికొట్టడంలో తనవంతు పాత్ర పోషించింది. స్వాతంత్ర్యం వచ్చాక ఈ గీతాన్ని భారత ప్రభుత్వం జాతీయ గేయంగా ప్రకటించింది.అవమానం నుంచి పుట్టిన ఈ గీతం ప్రతి భారతీయుని గుండెలో ఎప్పటికీ పదిలం. ఎన్ని యుగాలు గడచినా ఆరని నిత్య చైతన్య దీప్తి ’వందేమాతరం’.
Read Also: కోల్ కతాలో బాబ్రీకి పోటీగా గీతా పారాయణం!!
Follow Us on: Youtube


