పంచాయతీ ఎన్నికల(Panchayat Polls) రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎస్టీ సామాజికవర్గానికి 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారని, దీంతో అసలు ఎస్టీ జనాభా లేని పంచాయతీల్లో కూడా సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలు ఎస్టీలకు కేటాయించారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ఇప్పటికిప్పుడు విచారించలేమని హైకోర్టు తెలిపింది. ఈ పిటిషన్పై సింగిల్ బెంచ్ విచారించడం సరికాదని.. డివిజన్ బెంచ్కు వెళ్లాలని న్యాయమూర్తి సూచించారు.
Panchayat Polls పై పిటిషనర్ వాదనలు ఇవే..
వరంగల్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామంలో కేవలం ఆరుగురు ఎస్టీ ఓటర్లు ఉండగా సర్పంచ్, రెండు వార్డు స్థానాలను వారికి రిజర్వ్ చేశారని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తక్కలపల్లిలో కేవలం 8 మంది ఎస్టీ ఓటర్లు ఉండగా సర్పంచ్ స్థానాన్ని వారికి రిజర్వ్ చేశారని కూడా గుర్తు చేశారు. వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లిలో ఎస్టీ ఓటరు ఒక్కరూ లేకపోయినా సర్పంచ్ స్థానంతో పాటు మూడు వార్డు మెంబరు స్థానాలను ఆ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నల్లగొండ జిల్లా అనుముల మండలం శివాలయం పేరూరు గ్రామంలో ఎస్టీ ఓటర్లు లేకపోయినా సర్పంచ్ స్థానంతోపాటు 4 వార్డు మెంబర్లను రిజర్వ్ చేశారని కూడా పిటిషనర్ ప్రస్తావించారు.
వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశలపల్లి, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం భట్పల్లిలో 2011 జనాభా లెక్కల ప్రకారమే రిజర్వేషన్లు కేటాయించారని ధర్మాసనం ముందు ఉంచారు. ఈ అంశాలను పరిశీలించిన సింగిల్ బెంచ్ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై ఎలాంటి తీర్పు ఇచ్చినా తీవ్ర గందరగోళానికి దారి తీస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీనిపై డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకోవడమే మంచిదని అభిప్రాయపడుతూ బుధవారం డివిజన్ బెంచ్ ముందుకు పిటిషన్ తీసుకెళ్లాలని సూచించారు.
Read Also: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Follow Us On: Pinterest


