కలం, వెబ్ డెస్క్: ఈ కాలంలో స్మార్ట్ఫోన్ (Smartphone) వాడకం, సోషల్ మీడియా స్క్రోలింగ్ జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే కేవలం స్క్రోలింగ్ చేయడం వల్ల పెద్దగా సమస్య ఉండదని, విసుగ్గా, ఖాళీగా ఉన్నప్పుడు నిరంతరం ఫోన్ చూడటం వల్ల మెదడు తీవ్రంగా అలసిపోతుందని ప్రముఖ ఇంటిగ్రేటివ్ లైఫ్ స్టైల్ నిపుణుడు ల్యూక్ కౌటిన్హో తేల్చి చెప్పాడు. మెదడు విశ్రాంతి కోరుకుంటున్న సమయంలో మరో వీడియో చూడటం వల్ల ఓవర్ స్టిమ్యులేషన్ (అతి ఉత్తేజం) జరిగి గంటల కొద్దీ సమయం వృథా అవుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఫోన్ పక్కన పెట్టి, కేవలం 60 సెకన్ల పాటు మెదడుకు వేరే పని చెప్పాలని ఆయన సూచిస్తున్నారు.
దీనికోసం ‘మైక్రో రిచ్యువల్స్’ (చిన్నపాటి అలవాట్లు) పాటించాలని ల్యూక్ సూచించారు. 5-5-5 పద్ధతిలో ఐదు సార్లు నెమ్మదిగా శ్వాస (Breathing) తీసుకోవడం, కిటికీ దగ్గరకు వెళ్లి నిమిషం పాటు ఆకాశాన్ని చూడటం లేదా ఫోన్ లేకుండా ఇంట్లోనే వాక్ చేయాలని చెబుతున్నాడు. ఇష్టమైన పాటను వినడం వల్ల నరాల వ్యవస్థ త్వరగా కుదుటపడుతుందని ఆయన తెలిపాడు. అలాగే నీటిని నెమ్మదిగా తాగడం, ఇంట్లోని వస్తువులను సర్దడం వల్ల కూడా మైండ్కు ఉపశమనం లభిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

