కలం, నిజామాబాద్ బ్యూరో: రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది మూటల కోసమే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ శిక్షణ తరగతులకు కాకుండా.. బాన్సువాడలో పర్యటించండి అంటూ సలహా ఇచ్చారు. సోమవారం బండి సంజయ్ కామారెడ్డిలో (Kamareddy) పర్యటించి, బాన్సువాడలో రెండు వర్గాల గొడవలకు సంబంధించిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు బయట కూడా తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసమే బాన్సువాడలో హిందువులను జైల్లో వేశారని ఆరోపించారు. రోడ్డుపై నిలబడ్డ నాయకులపై కూడా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూసీ (Musi) పరిధిలో పేదల ఇండ్లను కూల్చి పెద్దలతో బేరాలాడుతున్నారని బండి విమర్శించారు. గాంధీ విగ్రహం పేరుతో పేదల ఇండ్లను కూల్చడం దుర్మార్గమని, గాంధీ ఆత్మ క్షోభిస్తదని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం గుజరాత్లో పటేల్ విగ్రహం నిర్మించి ప్రజల మనసులను దోచుకుందని గుర్తుచేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్ వల్ల ఏ దేశంతో యుద్దం వస్తుందో రాహుల్ (Rahul Gandhi) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్లోనే అంతర్యుద్దం మొదలైన సంగతి రాహుల్ గుర్తుంచుకోవాలని బండి సంజయ్ చురకలంటించారు.
బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ పేరుతో పేదల ఇండ్లు కూలిస్తే, అదే ప్రాంతంలోని పెద్దల ఇండ్లను బుల్డోజర్లతో తాము కూల్చివేస్తామని బండి హెచ్చరించారు. ఒవైసీ అక్రమంగా నిర్మించిన ఫాతిమా కాలేజీ కూల్చడానికి పరీక్షలు అడ్డు వస్తే.. ఖమ్మంలో ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల భవిష్యత్తు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. పేదలకు ఒక న్యాయం.. ఒవైసీ కాలేజీకి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు కాంగ్రెస్, మజ్లిస్ అరాచకాలను భరించాలని ప్రశ్నించాలని, బీజేపీ కార్యకర్తల ఓపికను చేతగానితనంగా భావిస్తే గుణపాఠం తప్పదని బండి సంజయ్ (Bandi Sanjay) వార్నింగ్ ఇచ్చారు.
Read Also: మరో ఆయిల్ ట్యాంకర్పై దాడి.. భారతీయుడి మృతి
Follow Us On: Youtube

