కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం (Bhadrachalam) పరిసరాల్లో ఉన్నా ఏజెన్సీ నియోజక వర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి అభివృద్ధి చేస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) హామీ ఇచ్చారు. ఆదివారం భద్రాచలం నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మాన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన వారు ధనిక తెలంగాణను అప్పుల పాలు చేశారని ధ్వజమెత్తారు. అప్పుల రాష్ట్రంలోనూ మేము పేదవాడి ప్రేమను పొందుతూ, అభివృద్ధి చేసి చూపిస్తుంటే.. ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్నారని మంత్రి ఆరోపించారు. “దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పాలెం వాగు ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే, పదేళ్ల పాలనలో దానిని పూర్తి చేయాలనే జ్ఞానం వీరికి రాలేదు. 15 వేల ఎకరాలకు నీరు రావాల్సి ఉంటే, కేవలం 3-4 వేల ఎకరాలకే అందుతోంది. రెండు మూడు రోజుల్లోనే సీతక్క, నేను, ఇరిగేషన్ మంత్రి చర్చించి, రాబోయే వర్షాకాలం పంట నాటికి పాలెం వాగు మిగిలిన పనులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామనీ హామీ ఇచ్చారు. రాళ్లవాగు వంతెనను కూడా ఇదే సీజన్లో పూర్తి చేస్తాం” అని హామీ ఇవ్వడం జరిగింది.
అలాగే భద్రాచలం, వెంకటాపురం జాతీయ రహదారికి కూడా మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. ములుగు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట ప్రాంతాల్లో తాటాకు గుడిసెల కింద నివసించే నిరుపేదలను చూసి, ఈ నియోజకవర్గాలకు మొదటి విడతలో అదనపు ఇళ్లను కేటాయించాం. ఏప్రిల్లో రెండో విడత ఇస్తాం.. ఇలా మొత్తం మూడు విడతల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టిస్తాం. కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచులకు మంత్రి పొంగులేటి ఆత్మీయ పిలుపునిచ్చారు.

