కలం, కరీంనగర్ బ్యూరో: మల్లోజుల వేణుగోపాల్ రావు (Mallujola Venugopal) ఐదున్నర దశాబ్దాల తర్వాత సొంతూరుకు చేరుకున్నారు. 1970లో అడవిబాటపట్టిన మల్లోజుల మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా ఎదిగారు. గత సంవత్సరం అక్టోబర్ 14న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట భారీగా ఆయుధాలు, అనుచరులతో సహా లొంగిపోయారు. అజ్ఞాతం వీడాక పోలీసు బందోబస్తు మధ్య గడ్చిరోలిలో ఉంటున్న వేణుగోపాల్ రావు ఐదు నెలల తర్వాత తొలిసారిగా పెద్దపల్లిలో (Peddapalli) తన సొంత ఇంటికి చేరుకొని స్నేహితులు, బంధువులను కలిశారు. ఆయన రాకతో పెద్దపల్లిలో చర్చనీయాంశంగా మారింది. మల్లోజుల వచ్చాడని తెలిసి చాలా మంది బంధువులు, స్నేహితులు, స్థానికులు ఆయనను చూసేందుకు వచ్చారు. మావోయిస్టు పార్టీని వీడి బయటికి వచ్చిన దృష్ట్యా మహారాష్ట్ర నుంచి ఒక ఎస్పీ స్థాయి అధికారితోపాటు 9 మంది పోలీసులు భద్రత కల్పించారు. స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
వేణుగోపాల్ రావు తల్లి మధురమ్మ 2022లో చనిపోగా, తండ్రి వెంకటయ్య 1997లోనే చనిపోయారు. వారికి ముగ్గురు కొడుకుల్లో వేణుగోపాల్ రావు చిన్నవాడు. వీరి రెండో కుమారుడు మల్లోజుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేస్తూ 2011లో పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ (Mallujola Venugopal) మావోయిస్టు ఉద్యమంలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం పాటు కార్యకలాపాలు నిర్వహించి పోలీసులకు సవాల్గా నిలిచారు. పలు ఎన్కౌంటర్లు, ఆపరేషన్లలో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చేది. కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజు మరణం తర్వాత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగుబాటు మావోయిస్టు పార్టీని బలహీనపరిచింది.
Read Also: పేదల ఇండ్లు కూల్చి ఏం సాధిస్తారు : రామచందర్ రావు
Follow Us On : WhatsApp

