కలం బ్యూరో, సంగారెడ్డి: సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో కలకలం రేపిన యువతి కిడ్నాప్ ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకున్నది. వట్పల్లి మండలం దరఖాస్తుపల్లిలో దర్గాలో పూజ చేస్తున్న యువతి కిడ్నాప్నకు గురైన విషయం తెలిసిందే. కాగా పోలీసుల ఎంక్వైరీలో సొంతబావలే నిందితులని తేలింది. చిన్నప్పటి నుంచి మరదలిపై బావ శ్రీకాంత్ ప్రేమ పెంచుకున్నాడు.
అయితే ఇటీవలే యువతికి వేరే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. దీంతో ఎలాగైనా మరదలిని దక్కించుకోవాలని శ్రీకాంత్ కిడ్నాప్ ప్లాన్ వేసాడు. తన సోదరులతోకలిసి యువతిని కిడ్నాప్ చేసి హైదరాబాద్వైపు తీసుకువెళ్లాడు. అంతేకాకుండా యువతిని పెళ్లి చేసుకునే యువకుడికి వీడియో కాల్ చేసిన బెదిరించాడు.
పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా గంటల వ్యవధిలో పుల్కల్ శివారులో కారును వెంబడించి పట్టుకొని కిడ్నాపర్లకు ట్విస్ట్ ఇచ్చారు. కిడ్నాప్కి వాడిన కారును స్వాధీనం చేసుకొని, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

