కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్లో పాకిస్థాన్ (Pakistan) ఓపెనర్లు అదరగొట్టారు. శ్రీలంకకు 213 పరుగుల లక్ష్యాన్ని విధించడంలో కీలక పాత్ర పోషించారు. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ 60 బంతుల్లో 100 పరుగులు చేసి జట్టుకు పటిష్టమైన పునాది వేశాడు. మరో ఓపెనర్ ఫకర్ జమాన్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 176 వరకు ఒక్క వికెట్ పడకుండా పాకిస్థాన్ ఆడినా ఆ తర్వాత ఫకర్ అవుట్ అయ్యాక పాక్ వికెట్లు టప టపా పడ్డాయి. నిర్ణీత 20 ఓవర్లకు పాకిస్థాన్ 8 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. అంటే ఓపెనర్లు కాకుండా మిగిలిన ఆరుగురు ప్లేయర్ల స్కోరు కేవలం 28 పరుగులు మాత్రమే. వీటిలో మళ్ళీ ఎక్స్ట్రాలు కూడా ఉన్నాయి. ఓపెనర్లు కాకుండా మరే ఇతర బ్యాటర్ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేదు. కెప్టెన్ సల్మాన్ ఆఘా, మహ్మద్ నవాజ్ డకౌట్ అయ్యారు. నాఫాయ్ 2, షాదాబ్ ఖాన్ 7, ఉస్మాన్ ఖాన్ 8, షాహిన్ షా అఫ్రిది 4, నసీమ్ షా 1, అబ్రార్ 0 నాటౌట్ పరుగులు చేశారు.
శ్రీలంక బౌలింగ్ చూస్తే.. పాక్ (Pakistan) ఓపెనర్లను ఔట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. మధుశంక 4 ఓవర్లు బౌలింగ్ చేసి 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. శనక 2, చమీరా 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ పాకిస్థాన్కు అత్యంత కీలకం. సెమీస్ రేసులో నిలవాలంటే శ్రీలంకపై కనీసం 64 పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంది. ఒకవేళ శ్రీలంక గెలిస్తే, నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా న్యూజిలాండ్ నేరుగా సెమీస్ చేరుకుంటుంది. ప్రస్తుతం మైదానంలో ఇరు జట్లు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. మరి పాకిస్థాన్ బౌలర్లను శ్రీలంక బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

