కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ పోలీసులకు (Hyderabad Police) మరో అంతర్జాతీయ సైబర్ నేరస్థుడు చిక్కాడు. మాట్రిమోనీ, క్రిప్టో కరెన్సీ పేరుతో కోట్లాది రూపాయల స్కామ్కు పాల్పడ్డ ప్రసన్నకుమార్ అనే వ్యక్తిని చెన్నై ఎయిర్ పోర్టులో హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రసన్న కుమార్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ. అతను కాంబోడియా నుంచి వస్తుండగా చెన్నైలో పోలీసులకు చిక్కాడు. ప్రసన్న కుమార్పై మ్యాట్రిమోనీ, క్రిప్టో కరెన్సీ మోసాలు చేశాడన్న ఆరోపణలున్నాయి. మ్యాట్రిమోనీ సైట్లలో యువతుల పేర్లతో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి చాలామంది యువకులను మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రసన్నకుమార్ దగ్గర పోలీసులు 500 సిమ్ కార్డులు గుర్తించారు. ప్రసన్న కుమార్ ఒక్కడే ఈ మోసాలకు పాల్పడ్డాడా? లేక ఇతడి వెనుక ఏదైనా ముఠా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

