కలం, వెబ్ డెస్క్ : బొలీవియా రాజధాని లా పాజ్ సమీపంలో శుక్రవారం ఒక భారీ విమాన ప్రమాదం (Bolivia Plane Crash) సంభవించింది. భారీ మొత్తంలో నగదును తరలిస్తున్న ఒక కార్గో విమానం విమానాశ్రయం సమీపంలోని హైవేపై ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
ప్రమాద తీవ్రతకు హైవేపై ప్రయాణిస్తున్న సుమారు పన్నెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విమానం కూలిన సమయంలో అందులోని కరెన్సీ నోట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. మరణించిన వారు విమానంలోని వారా లేక హైవేపై వాహనాల్లో ప్రయాణిస్తున్న వారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని ఫైర్ చీఫ్ పావెల్ తోవర్ పేర్కొన్నారు.
ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

