కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) జిల్లా రెంజల్ మండలంలోని త్రివేణి సంగమ క్షేత్రం కందకుర్తి పుష్కర ఘాట్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) బుధవారం పరిశీలించారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఈ పుష్కర ఘాట్ లో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. పుష్కర ఘాట్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల సమయంలోనే కాకుండా ఈ ప్రదేశానికి సాధారణ సమయాలలోనూ భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్ధం పరిసరాల పరిశుభ్రతతో పాటు కనీస సదుపాయాలు భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
గోదావరి పుష్కరాలకు (Godavari Pushkaralu) ఈ ఘాట్ వద్ద వీ.వీ.ఐ.పీలు, లక్షలాదిగా భక్తులు పుణ్య స్నానాలకు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వీలుగా తగిన వసతి, షామియానాలు వంటివి పక్కాగా అందుబాటులో ఉండాలన్నారు. భక్తులకు పూర్తి స్థాయిలో పటిష్ట భద్రత కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులు వంటలు చేసుకునేందుకు వీలుగా కిచెన్ షెడ్ నిర్మించాలని సూచించారు. పుష్కర ఘాట్ వద్ద మెట్లు, ఘాట్ లకు మరమ్మతులు చేయించాలన్నారు. ఘాట్ వద్ద హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని, రహదారికి మరమ్మతులు జరిపించాలని జిల్లా (Nizamabad) కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామారావు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.
Read Also: ఆపరేషన్ కగార్ : దేశంలోనే చారిత్రాత్మక ఘట్టం.. మోదీ సంచలన ప్రకటన
Follow Us On: Instagram

