కలం, వెబ్ డెస్క్: పోక్సో కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ దోషికి కలకత్తా హైకోర్టు(Calcutta High Court) బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు, అతని శిక్ష అమలును నిలిపివేసింది. ఈ మేరకు జస్టిస్ అరిజిత్ బెనర్జీ, జస్టిస్ అపూర్బ సిన్హా రాయ్తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. వివరాలు ఇలా ఉన్నాయి..
స్వపన్ హాల్దార్ 2015 ఆగస్టులో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. అనంతరం నేరం రుజువు కావడంతో అతనికి అలీపూర్ కోర్టు 2019లో జీవిత ఖైదు విధించింది. దీనిపై ఆయన అదే ఏడాది కలకత్తా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు. అయితే, ఏడేళ్లవుతున్నా అతని అప్పీల్ ఇంకా విచారణకు రాలేదు.
ఈ విషయాన్ని ధర్మాసనం గుర్తించింది. 2019 నుంచి పెండింగ్లో ఉన్న అతని అప్పీల్ ఇంకా విచారణకు రాకపోవడం, అతనికంటే ముందుగా దాఖలైన అప్పీళ్లు కూడా పెండింగ్లో ఉండటాన్ని పరిగణనలోకి తీసుకుని, జీవిత ఖైదు శిక్ష అమలును నిలిపివేసింది.
విచారణ సందర్భంగా.. స్వపన్ హాల్దార్ పదేళ్ల ఐదు నెలలుగా కస్టడీలో ఉన్నాడని, ఇందులో తీర్పు ముందూ, తీర్పు తర్వాత గడిపిన కాలం కూడా కలిపి ఉందని అతని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో అలీపూర్ కోర్టు తీర్పు అనంతరం దాదాపు ఏడేళ్లుగా స్వపన్ జైలులో ఉన్నాడని హైకోర్టు ధర్మాసనం గమనించింది. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రమాణాల ఆధారంగా శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
‘అప్పీల్ తుది విచారణ పూర్తయ్యే వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు శిక్ష అమలు నిలిపివేస్తున్నట్లు’ కోర్టు(Calcutta High Court) పేర్కొంది. అలాగే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

