కలం, వెబ్ డెస్క్ : భారీ సైబర్ మోసాల (Cyber Fraud) నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పెట్టుబడుల పేరుతో, డిజిటల్ అరెస్ట్ వంటి బెదిరింపులకు పాల్పడుతూ అమాయకుల నుంచి ఏకంగా 127 కోట్ల రూపాయలను కాజేసిన ముఠా గుట్టును సైబర్ క్రైమ్ విభాగం రట్టు చేసింది. ఈ భారీ ఆపరేషన్లో భాగంగా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి మొత్తం 104 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
సైబర్ క్రైమ్ (Cyber Fraud) నెట్వర్క్ సుమారు 151 బ్యాంకు ఖాతాల ద్వారా బాధితుల నుంచి సేకరించిన సొమ్మును ఇతర ప్రాంతాలకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి 36 లక్షల రూపాయల నగదుతో పాటు 200లకు పైగా మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, డెబిట్ కార్డులు, ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 86 మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లు ఉండగా, ఈ ఖాతాలను సరఫరా చేసే 17 మంది మధ్యవర్తులు కూడా ఉన్నారు. ముఖ్యంగా బంధన్ బ్యాంకుకు చెందిన ఒక రిలేషన్షిప్ మేనేజర్ కూడా ఈ మోసగాళ్లకు సహకరిస్తూ పట్టుబడటం గమనార్హం.
ఈ భారీ ఆపరేషన్ జాయింట్ సిపి ఎస్.ఎం. విజయ్ కుమార్ పర్యవేక్షణలో, సైబర్ క్రైమ్ డిసిపి వి. అరవింద్ బాబు నేతృత్వంలో కొనసాగింది. మొత్తం 32 ప్రత్యేక బృందాలు సుమారు 10 రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించి ఈ నెట్వర్క్ ముఠాను పట్టుకున్నాయి. ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం ఈ ముఠాకు దేశవ్యాప్తంగా సుమారు 1,055 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

