కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సవాల్ను స్వీకరిస్తున్నానని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ప్రకటించారు. వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను హరీశ్ రావు మంగళవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. సీఎం చెప్పినట్లు అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమన్నారు. అయితే సభలో మైక్ కట్ చేయొద్దని, కెమెరాలు తిప్పొద్దని షరతు విధించారు. ప్రాజెక్టుల గురించి ఎన్ని గంటలైనా చర్చిద్దామని సవాల్ విసిరారు. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీంపై హరీశ్ రావు సెటైర్లు వేశారు. ఇది తీపి కబురంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని, ఇది పాత కబురు అని ఎద్దేవా చేశారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1 శాతం ప్రభుత్వం కాంట్రిబ్యూషన్, 1 శాతం ఎంప్లాయిస్ కాంట్రిబ్యూషన్తో జర్నలిస్టులతో సహా ఉద్యోగులందరికీ హెల్త్ స్కీం తీసుకొచ్చిందని చెప్పారు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టి, ఒక్క శాతాన్ని ఒకటున్నర శాతం పెంచి కొత్తగా తీసుకొచ్చినట్లు చెప్తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు చెల్లించాలని, రెండున్నరేళ్లుగా పీఆర్సీ అమలు చేయలేదని, దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇటీవల మైసయ్య అనే రిటైర్డ్ ఎస్సై ప్రభుత్వం నుంచి రావాల్సిన పెన్షన్, ఇతర బకాయిలు అందక అనారోగ్యంతో మృతి చెందాడని గుర్తు చేశారు. ఇలాంటి రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు, ఇతరత్రా చెల్లింపులు పూర్తి చేసి తీపి కబురు అని ప్రచారం చేసుకోవాలని హరీశ్ రావు (Harish Rao) ఎద్దేవా చేశారు.
Read Also: మిగిలింది 11 మందే… తెలంగాణ డీజీపీ
Follow Us On: X(Twitter)

