కలం, వెబ్ డెస్క్: టీటీడీ (TTD) మే నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టిక్కెట్లను నేడు అధికారులు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. భక్తులు అధికారిక వెబ్సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. టీటీడీ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టిక్కెట్లు విడుదల చేయనున్నారు. అలాగే ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టిక్కెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. అంగప్రదక్షిణ దర్శనం కోసం భక్తులు నిర్దేశించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విరాళం అందించిన భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించబడుతుంది. అలాగే వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక స్లాట్లు కేటాయిస్తారు.
టిక్కెట్లు విడుదలయ్యే సమయంలో భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉన్నందున, భక్తులు ముందుగానే లాగిన్ అయి అవసరమైన వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. ఒకేసారి ఎక్కువ మంది ప్రయత్నించే కారణంగా వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే మళ్లీ ప్రయత్నించాలని కోరుతున్నారు. భక్తులు కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని, మోసగాళ్లను నమ్మవద్దని సూచిస్తున్నారు.


