కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలోని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నజాఫ్గఢ్ రోడ్డులోని సుభాష్ నగర్ మెట్రో రెడ్ లైట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం (Delhi Road Accident)లో 25 ఏళ్ల డెలివరీ ఎగ్జిక్యూటివ్ ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని రఘుబీర్ నగర్కు చెందిన హేమ్ శకర్ గా పోలీసులు గుర్తించారు.
ఫిబ్రవరి 21వ తేదీ తెల్లవారుజామున సుమారు 3:26 గంటల సమయంలో ఈ ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందింది. ప్రమాద సమయంలో హేమ్ శకర్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ పై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఆయన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ (DDU) ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నట్లు అలాగే నజాఫ్గఢ్కు చెందిన డ్రైవర్ మోహిత్ కుమార్ను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.


