కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్(T20 World Cup)లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమయింది. ఈ మ్యాచ్ ఇప్పటికే టోర్నీ నుంచి బయటకు వెళ్లిపోయిన రెండు జట్ల మధ్యే అయినా.. అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. అదే ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్ మ్యాచ్. ఇప్పటికే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించినా చివరి మ్యాచ్లో సంచలనం సృష్టించాలనే లక్ష్యంతో ఒమన్ క్రికెట్ జట్టు భావిస్తోంది. ఆస్ట్రేలియాతో తలపడటానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నామని ఒమన్ కెప్టెన్ జతీందర్ సింగ్ తెలిపాడు. ఈ సందర్భంగానే అతడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాను చిత్తు చేయడానికి ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డాడు. ఫిబ్రవరి 20న పల్లెకెలెలో ఆస్ట్రేలియాతో ఒమన్ తలపడనుంది.
గ్రూప్-బిలో ఒమన్ మూడు మ్యాచ్లు ఓడి నిరాశపరిచింది. ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్ గెలిచినా తర్వాత పరాజయాలతో టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. ఇప్పటికే శ్రీలంక, జింబాబ్వే జట్లు సూపర్-8కు చేరాయి. ఆస్ట్రేలియాతో మ్యాచ్ మ్యాచ్ తమకు మంచి అవకాశమని ఒమన్ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. టీ20(T20 World Cup)లో సరైన సమయంలో మెరుగ్గా ఆడితే ఫలితం సాధ్యమని తెలిపాడు. ఆస్ట్రేలియా ఫామ్ బలంగా లేదని భావిస్తున్నట్టు చెప్పాడు.
ఇరు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. 2024 టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా 164 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ అర్ధశతకం సాధించాడు. మార్కస్ స్టోయినిస్ వేగంగా పరుగులు చేశాడు. లక్ష్యచేధనలో ఒమన్ 125 పరుగులకే పరిమితమైంది. మిచెల్ స్టార్క్, ఆడమ్ జాంపా, నాథన్ ఎల్లిస్ తలో రెండు వికెట్లు తీశారు. స్టోయినిస్ మూడు వికెట్లు తీసి రాణించాడు.


