కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో దారుణ ఘటన (Jhansi Murder) వెలుగులోకి వచ్చింది. కేవలం ఒక కప్పు టీ విషయంలో మొదలైన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తనతో గొడవపడిన సొంత అన్నను తమ్ముడు అత్యంత కిరాతకంగా హతమార్చడమే కాకుండా, ఆ విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే గుంత తవ్వి పూడ్చిపెట్టాడు. ఈ దారుణం సుమారు పది రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే, అన్నదమ్ముల మధ్య టీ చేసే విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన తమ్ముడు విచక్షణ కోల్పోయి అన్నపై దాడి చేసి చంపేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇంటి ఆవరణలోనే శవాన్ని పూడ్చేశాడు. అయితే పది రోజులుగా పెద్దవాడు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని తమదైన శైలిలో విచారించగా.. టీ చేసే విషయంలో తమ మధ్య గొడవ జరిగిందని, ఆ కోపంలోనే అన్నను చంపేశానని నిందితుడు విచారణలో తెలిపాడు.
పోలీసులు మెజిస్ట్రేట్ సమక్షంలో నిందితుడు చూపించిన చోట తవ్వకాలు జరిపి కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, నిందితుడిపై కేసు నమోదు చేశారు.


