కలం, నల్లగొండ బ్యూరో: రెండు సంవత్సరాల్లోనే నల్లగొండ (Nalgonda) పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని, స్మార్ట్ సిటీ (Smart City) అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో బుధవారం మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. రాబోయే పదేళ్లలో నల్లగొండ ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దుతానన్నారు. నల్లగొండలో ఇకపై రౌడీయిజం, గంజాయి వంటి వాటిని ఉక్కు పాదంతో అణచివేస్తానని తెలిపారు. పట్టణాన్ని శాంతి సామరస్యాలకు, ప్రశాంత వాతావరణానికి నిలయంగా తీర్చిదిద్దుతానని, పేదవాడి అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు.
పట్టణంలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, పట్టణంలోని అంగన్వాడీలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. బొట్టుగూడా పాఠశాల మాదిరిగానే మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. రూ.20 కోట్లతో న్యాక్ బిల్డింగు నిర్మాణంలో ఉందని, రూ.84 కోట్ల వ్యయంతో నిర్మించిన అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం పూర్తయిందని చెప్పారు. రూ.80 లక్షల వ్యయంతో అభివృద్ధి చేయనున్న పద్మావతి కాలనీ పార్కు పనులు, రూ.50 లక్షలతో అభివృద్ధి చేసే శివాజీ నగర్ పార్కు పనులకు శంకుస్థాపన చేశారు.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు లైనింగ్ పనులు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయని, బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తున్నామని, నల్గొండ పట్టణంలో లతీఫ్ సాబ్ గుట్ట, బ్రహ్మంగారి గుట్ట ఘాట్ రోడ్లతో పాటు, ఔటర్ రింగ్ రోడ్, 8 సబ్ స్టేషన్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్య, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


