కలం, వెబ్ డెస్క్ : అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో చెలరేగిన భారీ అగ్నిప్రమాదాలను (Forest Fire) అదుపు చేసేందుకు భారత వైమానిక దళం (IAF) యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. అరుణాచల్ ప్రదేశ్లోని వాలాంగ్ ప్రాంతంలో వాయుసేన హెలికాప్టర్లు, సుమారు 1,39,800 లీటర్ల నీటిని ఆకాశం నుంచి కుమ్మరించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చాయి.
మరోవైపు నాగాలాండ్లోని జుకో వ్యాలీ ప్రాంతంలో కార్చిచ్చు (Forest Fire) ఇంకా కొనసాగుతోంది. జపు శిఖరం సమీపంలోని కఠినమైన వాలులు, దట్టమైన పొగ కారణంగా ఏర్పడిన లో విసిబిలిటీ, తక్కువ గాలి వంటి వాతావరణ పరిస్థితుల్లో ఎంఐ-17 వి5 హెలికాప్టర్లు అగ్నిమాపక చర్యల్లో నిమగ్నమయ్యాయి. దిమాపూర్లోని పదుంపోఖిరి సరస్సు నుంచి నీటిని సేకరిస్తూ ఈ ఆపరేషన్ను వాయుసేన సిబ్బంది కొనసాగిస్తున్నారు.


