కలం, వెబ్డెస్క్: దేశంలో సోదరభావాన్ని పెంపొందించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై (Political Leaders) ఉందని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది. రాజకీయ ప్రసంగాలపై మార్గదర్శకాలు జారీ చేయాలంటూ దాఖలైన వివిధ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నట్లు కాకుండా, విస్తృత ప్రయోజనం ఉండేలా పిటిషన్లను సవరించాలంటూ పిటిషనర్లను కోర్టు ఆదేశించింది. వీరిలో విద్యావేత్త రేఖా వర్మ కూడా ఉన్నారు.
విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అన్ని వర్గాలూ నియంత్రణ పాటించాలని, రాజకీయ నాయకులు దేశంలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని వ్యాఖ్యానించింది. ‘ ప్రసంగాలపై మనం మార్గదర్శకాలు జారీ చేసినా వాటిని ఎవరు అనుసరిస్తారు?’ అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఇదే అంశంపై గతంలో జారీ చేసిన కొన్ని ఆదేశాలను ప్రస్తావించింది. ‘పఠాన్ జమాల్ వలీ కేసు నుంచి అమిష్ దేవగన్ కేసు వరకు ఎన్నో మార్గదర్శకాలు జారీ చేశాం. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదే’ అని స్పష్టం చేసింది.
ప్రజాసేవకులు పాలన నియమావళికి కట్టుబడి ఉండాలని, రాజ్యాంగ, నైతికత పరిమితులను పాటించాలని స్పష్టం చేసింది. ప్రసంగాల మూలం ఆలోచనలేనని, రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన ఆలోచనల్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం (Supreme Court) వ్యాఖ్యానించింది.
కాగా, రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్నవాళ్లు, ఉన్నతాధికారుల ప్రసంగాలను నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలంటూ దాఖలైన మరో పిటిషన్ను విచారించడంపై సుప్రీంకోర్టు ఆసక్తి చూపలేదు. అంతకుముందు, సోమవారం అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ దాఖలైన పిటిషన్లను ఆ రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేయాలంటూ సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే.
Read Also: ముంబై రోడ్లపై పరుగులు తీసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
Follow Us On: Instagram


