కలం, వెబ్డెస్క్: బ్యాంకు నుంచి 2.7కిలోల బంగారు ఆభరణాలు కాజేసిన ఉద్యోగి నిర్వాకమిది (Gold Theft). కొట్టేసిన నగలను బెట్టింగ్ కోసం తాకట్టు పెట్టినట్లు తెలిసి కస్టమర్లు లబోదిబోమంటున్నారు. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని గిరినగర్లో ఉన్న ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్లో కిరణ్ కుమార్(34) అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు.
ఇదే బ్యాంకులో గోల్డ్ లోన్ కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని డబ్బు కట్టి విడిపించుకునేందుకు ఓ మహిళ బ్యాంకుకు వచ్చింది. లాకర్ తీసుకొని బంగారు నగలు సరిచూసుకోగా, అందులో నుంచి కొన్ని కనిపించలేదు. దీంతో ఆమె మేనేజర్ దిలీప్ కుమార్కు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆయన పరిశీలించగా బంగారు నగలు తక్కువున్నట్లు తేలింది. దీంతో అనుమానం వచ్చిన ఆయన మరికొందరు ఖాతాదారుల లాకర్లను చెక్ చేశారు. వాటిలోనూ నగలు కనిపించలేదు. లెక్క పెట్టగా సుమారు రూ.4కోట్ల విలువైన 2.7కిలోల బంగారు ఆభరణాలు మిస్సయినట్లు తేలింది.
మేనేజర్ రానప్పుడు లాకర్ తాళాలను ఉపయోగించే అధికారం ఉన్న కిరణ్ కుమార్ ఈ నగలను తస్కరించినట్లు గుర్తించారు(Gold Theft). వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వాళ్లు నిందితుని అరెస్టు చేశారు. దర్యాప్తులో నిందితుడు నేరం అంగీకరించాడు. ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి వాటిని తాకట్టు పెట్టినట్లు చెప్పాడు. నిందితుని నుంచి 1.2కిలోల నగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తాకట్టులో ఉన్న మిగిలిన వాటిని విడిపించేందుకు కోర్టును ఆశ్రయించారు.


