కలం, నల్లగొండ బ్యూరో : మునుగోడు (Munugode) ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో ‘మర్యాదగా ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి. లేకుంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి పదవి ఎక్కుతా’ అంటూ సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) టార్గెట్గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
తాజాగా ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే మొనగాడా? ‘పదేండ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా’ అని చెప్పుకోవడం తప్పు కాదా? అంటూ రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ప్రశ్నించారు. ‘అలా మాట్లాడి మమ్మల్నే కాదు.. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ను సైతం అవమానించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా రేవంత్ రెడ్డి మొనగాడైతే.. పార్టీలోనూ ఆయనే గట్టొడైతే.. మహబూబ్నగర్ ఎంపీ సీటు ఎందుకు ఓడిపోయిందని నిలదీశారు. రేవంత్ బలమైన వ్యక్తి అయితే సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిలో ఎంపీగా ఎందుకు ఓడిపోయారని ఎద్దేవా చేశారు.
అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు గెలవలేకపోయిందన్నారు. టీపీసీసీ చీఫ్గా రేవంత్ ఉన్న సమయంలో హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే.. అది పార్టీ కార్యకర్తల చెమట చుక్కల ప్రతిఫలమేనని చెప్పారు. పదేండ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ అనడం పెద్ద తప్పని.. ఈ విషయంలో రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డిగా వ్యవహారం కంటిన్యూ అవుతుందని చెప్పాలి.
Read Also: అల్లు వారింట మొదలైన పెళ్లి పనులు.. మొదటి వెడ్డింగ్ కార్డ్ ఎవరికంటే?
Follow Us On: Sharechat


