కలం, వెబ్డెస్క్: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) బంగ్లాదేశ్కు వెళ్లనున్నారు. ఈ నెల 17న బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న తారిఖ్ రహ్మాన్ (Tarique Rahman) ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మేరకు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ వేడుకకు రమ్మని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే. అయితే, పీఎం మోదీకి బదులు స్పీకర్ ఓం బిర్లా, విదేశాంగ కార్యదర్శి మిస్రీ వెళతారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగు పర్చడంలో స్పీకర్ ఓం బిర్లా పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపింది.
కాగా, గత గురువారం బంగ్లాదేశ్ (Bangladesh) పార్లమెంట్కు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 297 స్థానాలకు గాను 212 గెలిచి బీఎన్పీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, బంగ్లా దివంగత మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రహ్మాన్ ఈ నెల 17 ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది. దీనికి హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపినప్పటికీ ఈ నెల 16 నుంచి 19 వరకు ఢిల్లీలో గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరగనున్న దృష్టా ఆయన బదులు స్పీకర్ను (Speaker Om Birla) పంపేందుకు భారత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఏడాదిన్నర కిందట విద్యార్థుల ఆందోళన కారణంగా అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని, అవామీ లీగ్ పార్టీ అధినేత్రి షేక్ హసీనా పదవిని వదిలేసి, భారత్తో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భారత వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడి హిందువులపై దాడులు, హత్యలు జరిగాయి. బంగ్లాదేశ్ సైతం క్రమక్రమంగా పాకిస్థాన్తో సంబంధాలు పెంచుకుంటోంది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో రెండు దేశాల మధ్య తిరిగి సత్సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.
Read Also: 3 సూత్రాలు.. 7 చక్రాలు : రేపటి నుంచి ఏఐ సమ్మిట్
Follow Us On: Instagram


