కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు (శనివారం) మంత్రులతో సమావేశం కాబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ జోష్ మీద ఉంది. ఈ ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించబోతున్నట్టు సమాచారం. నేడు సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్న తొలి సమీక్ష సమావేశం కావడంతో మంత్రివర్గ సభ్యులందరూ హాజరుకానున్నారు. వివిధ మున్సిపాలిటీల్లో వచ్చిన ఫలితాలు, పార్టీ పనితీరు, స్థానిక స్థాయిలో ఎదురైన సమస్యలు, ప్రచార వ్యూహాల ప్రభావం వంటి అంశాలపై సీఎం మంత్రులతో చర్చించే అవకాశం ఉందని సమాచారం. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేదు. దీంతో దీనిపై కూడా ముఖ్యమంత్రి (CM Revanth Reddy) చర్చించే అవకాశం ఉంది.
పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల తీరు, స్థానిక నాయకత్వం పాత్ర, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం వంటి అంశాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టే అవకాశముంది. ఎన్నికల ఫలితాల ఆధారంగా భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై కూడా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే పట్టణాభివృద్ధి, మున్సిపల్ పరిపాలనలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలపై మంత్రులకు సీఎం సూచనలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ పనితీరును మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చ జరగనుందని సమాచారం.


