కలం, తెలంగాణ బ్యూరో : ఎన్నికల ప్రచారంలో జిల్లాల్లో హడావిడిగా సుడిగాలి పర్యటన చేసి అనంతరం ఢిల్లీ(Delhi)కి వెళ్లే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఫలితాల రోజు కూడా అక్కడే ఉండడం ఒక సంప్రదాయంగానే కొనసాగుతున్నది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఇదే రిపీట్ అయింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నవంబరు 11న జరగ్గా ఫలితాలు నవంబరు 14న వెలువడ్డాయి. కౌంటింగ్కు రెండు రోజుల ముందే అఫీషియల్ టూర్ మీద ఢిల్లీ వెళ్లారు. కౌంటింగ్ రోజు సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్కు తిరిగొచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబరు నెలలో మూడు ఫేజ్లలో జరిగింది. చివరి ఫేజ్ డిసెంబరు 17న జరగ్గా ఆ దశ కౌంటింగ్ అదే రోజు సాయంత్రం వెలువడింది. ఆ రోజున కూడా సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు.
తాజాగా మున్సిపల్ ఎన్నికలు సింగిల్ ఫేజ్లో ఫిబ్రవరి 11న జరిగాయి. అదే రోజున కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకుని ఢిల్లీ వెళ్ళారు. మూడు రోజుల పాటు అక్కడే బస చేసిన ఆయన సరిగ్గా కౌంటింగ్ రోజు (ఫిబ్రవరి 14) సాయంత్రం హైదరాబాద్కు రిటన్ అవుతున్నారు. కౌంటింగ్ రోజు సీఎం రేవంత్ ఢిల్లీలో ఉండడం యాధృచ్ఛికమా?.. లేక ఇంకేదైనా కారణం ఉన్నదా?.. అనే చర్చలు ఎలా ఉన్నా వరుసగా మూడు ఎన్నికల ఫలితాలు వెలువడే సందర్భంగా ఢిల్లీలో పర్యటించడం ఆసక్తికరం.


