కలం, వరంగల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కార్పొరేట్ అనుకూల లేబర్ కోడ్లను (Labour Codes) రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు (Takkallapalli Srinivasa Rao) డిమాండ్ చేశారు. గురువారం కార్మిక సంఘాల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ‘భారత్ బంద్’లో భాగంగా హనుమకొండ (Hanumakonda)లో భారీ ర్యాలీ నిర్వహించారు. సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక వైఖరిని ఆపాలన్నారు. నాలుగు కార్మిక కోడ్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల, రైతుల ప్రయోజనాలను కాపాడాలన్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ) తో ఇటీవలి వాణిజ్య ఒప్పందాలు మన దేశానికి నష్టం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత, చర్యలు అవసరమని చెప్పారు.
ఉపాధి హామీ స్థానంలో తెచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టం (VB G RAM G Act) గ్రామీణ ప్రాంతాల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల అధికారాలను హస్తగతం చేసుకోవడం వంటి చర్యల ద్వారా కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సుమారు 40 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని ఆయన కోరారు.
ధర్నాలో (Hanumakonda) వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, సిపిఎం నాయకులు సారంపల్లి వాసుదేవ రెడ్డి, ఎం.చుక్కయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేల్పుల సారంగపాణి, జక్కు రాజు గౌడ్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్, జిల్లా నాయకులు తేలూరు ఉప్పలయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుల నున్నా అప్పారావు, ఐఎన్టీయూసి నాయకులు కె.వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: చట్టసభల్లో సభ్యులకు భద్రత ఎంత? మోదీకి సైతం ముప్పు?
Follow Us On: Pinterest


