కలం, వెబ్ డెస్క్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కమిటీ, నిబంధనలు (Accreditation Policy), అర్హతలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోను సవాల్ చేస్తూ హైటెక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బుధవారం ఉదయం ఈ పిటిషన్పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో డిజిటల్, కేబుల్ ఛానళ్లకు అక్రిడిటేషన్ల జారీకి నిర్ణయించిన అర్హతలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియ మొదలైందని, జీవో అమలును నిలిపి వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం ఏ ప్రాతిపదికన మార్గదర్శకాలు జారీ చేసిందో తెలుసుకోకుండా స్టే ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని సీఎస్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార శాఖ కమిషనర్, మీడియా అకాడమీ ఛైర్మన్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేసింది.


