కలం, డెస్క్ : భక్తులను అగౌరవపరిచేలా వ్యవహరించొద్దని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. శ్రీశైలం ఆలయంలో శివమాల ధారణ భక్తులపై జరిగిన లాఠీచార్జ్ పై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆలయంలో భక్తులకు ఇబ్బంది కలగొద్దని.. మాలధారణ చేసిన వారు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సూచించారు. శ్రీశైలంతో పాటు రాష్ట్రంలోని ఆలయాల్లో సౌకర్యాలపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి నాటికి భక్తులు మరింతగా వస్తారు కాబట్టి ముందస్తుగానే ఏర్పాట్లు చేయాలని డీజీపీతో పాటు ఇతర అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu). హోం శాఖ మంత్రి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక శ్రద్దతో ఎప్పటికప్పుడు ఆలయాల్లో ఏర్పాట్లపై సమీక్ష జరపాలని సీఎం చంద్రబాబు సూచించారు. భక్తుల రద్దీకి తగ్గట్టు దర్శనాల సమయాలపై నిర్ణయాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.


