కలం, డెస్క్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ హైదరాబాద్ లో (Hyderabad) పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గోషామహల్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోషామహల్ జ్ఞాన్ బాగ్ కాలనీలో నివాసం ఉంటున్న గణ్ పత్ రామ్, మహేందర్, జ్యోతారామ్ కలిసి ఓ వ్యక్తి నుంచి రూ.67 లక్షలు తీసుకుని.. ఆ మొత్తాన్ని తమ గ్యాంగ్ లోని సభ్యులకు అప్పగించేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో గోషామహల్ పోలీసులు వారిని పట్టుకుని విచారించగా.. అసలు గుట్టు విప్పారు. ఈ ముగ్గురూ గతంలో నుంచే అక్రమ నగదు రవాణా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అఫ్జల్ గంజ్ లోని ఓ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుని వెళ్తుండగా పట్టుకున్నట్టు చెప్పారు. ఈ నగదును మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు పంచడం కోసమే తీసుకెళ్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.


